విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. చిట్లిన పుర్రె ఎముక.. చిత్తూరులో ఘటన

  • క్లాసులో అల్లరి చేస్తోందని బ్యాగుతో కొట్టిన టీచర్
  • రెండు రోజుల పాటు తలనొప్పితో బాధపడ్డ విద్యార్థిని
  • ఆసుపత్రికి తీసుకెళ్లగా బయటపడ్డ దారుణం
చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. క్లాసులో అల్లరి చేస్తున్న ఓ విద్యార్థినిని టీచర్ బ్యాగుతో తలపై కొట్టారు. దీంతో ఆ బాలిక పుర్రె ఎముక చిట్లిపోయింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సదరు టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

జిల్లాలోని పుంగనూరు పట్టణానికి చెందిన హరి, విజేత దంపతులు తమ కూమార్తె సాత్విక నాగశ్రీ (11)ని స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో చదివిస్తున్నారు. ఆరో తరగతి చదువుతున్న సాత్వికపై ఇటీవల టీచర్ చేయిచేసుకున్నారు. క్లాసులో అల్లరి చేస్తోందని కోపగించుకున్న టీచర్.. విచక్షణ మరిచి అందుబాటులో ఉన్న బ్యాగుతో సాత్విక తలపై కొట్టారు. సాత్విక తల్లి విజేత కూడా అదే పాఠశాలలో పనిచేస్తున్నారు.

ఈ ఘటనను సాధారణ మందలింపుగా భావించిన విజేత తొలుత పట్టించుకోలేదు. అయితే, రెండు రోజులుగా సాత్విక తలనొప్పితో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో సాత్విక పుర్రె ఎముక చిట్లినట్లు తేలింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన సాత్విక తల్లిదండ్రులు.. స్కూల్ టీచర్ పైనా, యాజమాన్యంపైనా ఫిర్యాదు చేశారు.

Satvika Nagasri
Chittoor
Teacher Assault
Student Injury
School Violence
Punganur
Private School
Andhra Pradesh
Child Abuse

More Telugu News